నేను రెడీ మీరు రెడీనా: సీఎం రమేష్ కు జీవీఎల్ సవాల్
తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీఎం రమేశ్ ఇళ్లపై రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులు మొత్తం కేంద్ర ప్రభుత్వం డైరక్షన్లోనే జరుగుతున్నాయని టీడీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు.
హైదరాబాద్: తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీఎం రమేశ్ ఇళ్లపై రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులు మొత్తం కేంద్ర ప్రభుత్వం డైరక్షన్లోనే జరుగుతున్నాయని టీడీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ విమర్శలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా సీఎం రమేష్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ, అవగాహన తక్కువ అంటూ ధ్వజమెత్తారు. స్టీల్ మినిస్టర్ బిరేంధేర్ సింగ్ ని కలిసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జీఎస్ఐ ద్వారా సబ్మిట్ చేయవలసిన రిపోర్ట్ ఆలస్యం అయ్యిందో తెలుసుకుంటే బాగుండేదని సూచించారు. డ్రామాలపైనా, అవినీతి పైన ఉన్న శ్రద్ధ అభివృద్ధిపైన ఉండుంటే రాష్ట్రం బాగుపడేది అంటూ టీడీపీ ఎంపీలకు చురకలంటించారు.
సీఎం రమేష్ కు సవాల్ కు కౌంటర్ గా జీవీఎల్ మరో ట్వీట్ చేశారు. అచ్చోసిన అంబోతులు అంటూ ఘాటుగా విమర్శించారు. రమేష్.. రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసునంటూ మండిపడ్డారు.
మీలాగే ఛాలెంజ్ చేసి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గతంలో తోక ముడిచారు. మీరూ అంతేనా అంటూ ప్రశ్నించారు. మీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ. పెర్ఫార్మన్స్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. నేను చర్చకు రెడీ మీరు సిద్ధమా అంటూ ఎంపీ జీవీఎల్ సవాల్ విసిరారు.
అంతకుముందు జీవీఎల్కు సీఎం రమేష్ సవాల్ విసిరారు. దానికి బీజేపీ ఎంపీ ప్రతి సవాల్గా ట్విట్టర్లో స్పందించారు. అంతేకాదు సీఎం రమేశ్కు తనకు చేసిన ఛాలెంజ్ వీడియోను కూడా తన ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు.
ఏపీలో ఐటీ సోదాలు మొదలైనప్పట్నుంచి కేంద్రంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతలు మరియు బీజేపీ నేతల మధ్య ఐటీ దాడులు మాటల యుద్ధం రేపుతున్నాయి. టీడీపీ బీజేపీ నేతలు ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
టీడీపీ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుంటే.. అంతే రీతిలో బీజేపీ నేతలు సైతం కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా జీవీఎల్ చేసిన సవాల్కు టీడీపీ నేతలు ఎలా సమాధానం చెప్తోరో వేచి చూడాలి.