జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ హత్యకు కుట్రపన్నినట్లుగా వస్తున్న వార్తలపై స్పందించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. వైసీపీ కార్యకర్తల మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ హత్యకు కుట్రపన్నినట్లుగా జనసేన నేతలు సంచలన వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్కు భద్రతను కల్పించాలని.. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు పవన్కు భద్రతను పట్టించుకోరా అని సీఎం రమేశ్ నిలదీశారు. వైసీపీ కార్యకర్తల మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేస్తానని సీఎం రమేశ్ పేర్కొన్నారు.
ఇకపోతే.. పవన్ కల్యాణ్ను అనుమానాస్పద వ్యక్తులు అనుసరించడంపై జనసేన పార్టీ నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘‘ఈ మధ్య పవన్ కల్యాణ్ను అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా అనుసరిస్తున్నారు. విశాఖ సంఘటన తరువాత పవన్ కల్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారు. కారులోని వ్యక్తులు పవన్ కల్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుసరిస్తున్న వారు అభిమానులు కాదని పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారు.
ALso REad:శత్రువులైనా క్షేమం కోరుకుంటాం, మాకేం అవసరం : పవన్ హత్యకు కుట్రపై జోగి రమేశ్ స్పందన
వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కారులో, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారు. కాగా సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కల్యాణ్ను దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆయినా సంయమనం పాటించిన సిబ్బంది.. ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్కు అందించగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు పిర్యాదు చేశారు’’అని నాదెండ్ల మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
