మంత్రుల దగ్గరకు కుక్కలు రావడం లేదు...మా దగ్గరకు వస్తున్నాయన్న ఎమ్మెల్యే
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కుక్కలపై ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుక్కల బెడద ఎక్కువైపోయిందని తమను రక్షించాలని కోరారు. మంత్రుల దగ్గరకు కుక్కలు రావడం లేదేమో కానీ తమ దగ్గరకు మాత్రం ఫుల్ గా కుక్కలు వస్తున్నాయంటూ ఎమ్మెల్యే తెలిపారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కుక్కలపై ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుక్కల బెడద ఎక్కువైపోయిందని తమను రక్షించాలని కోరారు. మంత్రుల దగ్గరకు కుక్కలు రావడం లేదేమో కానీ తమ దగ్గరకు మాత్రం ఫుల్ గా కుక్కలు వస్తున్నాయంటూ ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల నియోజకవర్గంలో కుక్కల బెడద ఉందో లేదో తెలియదు కానీ విశాఖపట్నంలో మాత్రం కుక్కల బెడద విపరీతంగా ఉందన్నారు.
దోమలపై దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం ఇకపై కుక్కలపై దండయాత్ర చెయ్యాలని ఆర్థిక మంత్రి యనమలను కోరారు. కుక్కలు తన పొలంలో కోడెదూడను చంపుకు తినేశాయని తెలిపారు. కుక్కల స్వైర విహారంకు సంబంధించి ఫోటోలను సభకు అందజేస్తానని విష్ణుకుమార్ రాజు తెలిపారు.
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నకు మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పారు. మున్సిపల్ శాఖ కుక్కల సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. చట్ట ప్రకారం కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటున్నట్ల తెలిపారు. కుక్కలకు సంబంధించి చర్చ రావడంతో సభలో నవ్వులు వెలిశాయి.