తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం  ఆ పార్టీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ను నియమించింది. 


హైదరాబాద్: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం నాడు చంద్రశేఖర్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా నియమించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రశేఖర్. ప్రస్తుతం బీజేపీ రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

గత ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. సుమారు 19 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. 

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి కనీసం పదికిపైగా స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహారచన చేస్తుంది.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది బీజేపీ. దక్షిణాది రాష్ట్రాలపై ఈ దఫా బీజేపీ కేంద్రీకరించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే. పీ. నడ్డా ఈ నెల 16వ తేదీన సమావేశం కానున్నారు. 

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం బీజేపీకి దక్కింది. అయితే ఈ దఫా మాత్రం 8 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహారచన చేస్తుంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు రాకుండా రాకపోవడానికి రాష్ట్రంలోని కొందరు నేతల వైఖరి కూడ కారణమనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా ఈ విషయమై పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు.