Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుతో పొత్తుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: పురంధేశ్వరి స్పందన ఇదీ...

చంద్రబాబు నాయకత్వంలోని టిడిపితో పొత్తు పెట్టుకుంటానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై బిజెపి ఎపి చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పొత్తులపై తమ పార్టీ అధిష్టానిదే తుది నిర్ణయమని ఆమె అన్నారు.

BJP AP president Purandheswari reacts on Pawan Kalyan statement kpr
Author
First Published Sep 17, 2023, 11:11 AM IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధినాయకత్వానిదేనని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. టిడిపితో పొత్తుపై తాను బిజెపి అగ్ర నాయకత్వానికి వివరిస్తానని, తమ జనసేన పార్టీ ఎన్డీఎలో కొనసాగుతుందని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను ఆమె గుర్తు చేశారు. తాము కూడా తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతామని ఆమె చెప్పారు.

తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో పొత్తు పెట్టుకుంటానని తాను ప్రకటించడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డాకు వివరించనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. టిడిపితో పొత్తును ప్రకటించడానికి గల కారణాన్ని ఆయన వారికి చెప్పనున్నారు. తమ పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ)లో భాగస్వామి అని, ఎన్డీఎలో తాము కొనసాగుతామని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్ ఇటీవల కలిశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబుతో భేటీ తర్వాన ఆయన చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

పవన్ కల్యాణ్ శనివారంనాడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించడానికి తాను బిజెపికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రగతి చూడాలని తాను బిజెపి జాతీయ నాయకత్వాన్ని కోరుతానని ఆయన చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మంచి సీట్లు సాధించి శాసనసభలోకి ప్రవేశిస్తుందని పవన్ కల్యాణ్ చెపపారు. రాష్ట్ర పెద్ద యెత్తున అభివ్రుద్ధి చేస్తామని, శాంతిభద్రతలన పరిరక్షిస్తామని, విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులను కేటాయిస్తామని, ఉత్తరాంధ్ర వలసను అరికడుతామని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios