‘బాబుతో నేను’ పేరుతో టీడీపీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా భువనేశ్వరి ముఖ్య నేతలతో భేటీ అయ్యి, చర్చిస్తున్నారు.  

రాజమండ్రి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తొలిసారి పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ తో కలిసి ఆయన యువగళం పాదయాత్రకు వాడుతున్న బస్సులోనే భువనేశ్వరి ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ గత మూడు రోజులుగా యాక్టివ్ ఉన్నారు. మంగళవారం పార్టీని ముందుకు నడిపేందుకు తానున్నానంటూ ప్రెస్ మీట్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ సాయంత్రం రాజమండ్రికి చేరుకోనున్నారు. మంగళవారం కుటుంబసభ్యులు భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణిలు రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

ఆ సమయంలో చంద్రబాబు చేసిన సూచనలతోనే కుటుంబసభ్యులు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ‘బాబుతో నేను’ కార్యక్రమంతో టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇంకా కొద్ది రోజుల వరకు చంద్రబాబు జైల్లోనే ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.