badvel assembly bypoll: టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు వీరే
కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వైసీపీ అభ్యర్ధిగా దాసరి సుధలు బరిలోకి దిగనున్నారు.బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారింది.
కడప: కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ (badvel assembly )నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలను అధికార వైసీపీ(ycp), విపక్ష టీడీపీ(tdp)లు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. 2019 ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య(venkata subbaiah) పోటీ చేసి విజయం సాధించారు. అయితే అనారోగ్య కారణాలతో వెంకట సుబ్బయ్య ఇటీవల మరణించారు.
బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను ఆ పార్టీ బరిలోకి దింపుతుంది. టీడీపీ అభ్యర్ధిగా ఓబులాపురం రాజశేఖర్ ను బరిలోకి దింపుతుంది.కడప జిల్లాకు చెందిన నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే బద్వేల్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. టీడీపీ అభ్యర్ధి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. అయితే కొంత కాలంగా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ పట్టుకోల్పోతుంది. బిజివేముల వీరారెడ్డి ఈ స్థానం నుండి వరుసగా విజయాలు సాధించారు. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కూతురు ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.
బద్వేల్ అసెంబ్లీ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయింది. కొన్ని ఏళ్లుగా ఈ స్థానంలో టీడీపీ ఉనికి కోసం పోరాటం చేస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నామమాత్రంగానే విజయాలను నమోదు చేసింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరమని ప్రకటించింది. ఈ స్థానం నుండి బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్ధిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.ఈ స్థానం నుండి జనసేన పోటీ చేస్తోందా లేదా బీజేపీ పోటీ చేస్తోందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.