కృష్ణా జిల్లా గన్నవరంలో పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మరణానికి జబీబుల్లానే కారణమంటూ యువతి తల్లిదండ్రులు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. 

కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన 20 ఏళ్ల మొహమ్మద్ జాస్మిన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు స్థానికుడైన ఎస్‌కే జబీబుల్లా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనికి అప్పటికే పెళ్లయి భార్యా ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఇదే సమయంలో జాస్మిన్, జబీబుల్లాల పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం యువతి తల్లిదండ్రుల దృష్టికి చేరడంతో వారు పలుమార్లు జబీబుల్లాను హెచ్చరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో జబీబుల్లా ఇల్లు మారడంతో పాటు తన ఫోన్ ఎత్తకపోవడంతో జాస్మిన్ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన పిన్నమనేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాస్మిన్ తుదిశ్వాస విడచింది. అయితే తమ కుమార్తె మరణానికి జబీబుల్లానే కారణమంటూ యువతి తల్లిదండ్రులు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. జబీబుల్లా తమ బిడ్డను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.