మహిళలపై అఘాయిత్యాలు ... యూపీ, బీహార్ను మించిపోయిన ఏపీ : కేంద్రం కీలక ప్రకటన
మహిళలపై అత్యాచారాల విషయంలో ఉత్తరప్రదేశ్, బీహార్లను ఆంధ్రప్రదేశ్ మించి పోయింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా లోక్సభలో వెల్లడించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన నేపథ్యంలో విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం ఏపీకి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాని కేంద్ర హోంశాఖ మంగళవారం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018తో పోల్చితే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు 4,340 ( 22 శాతం) , దాడులు 18,883 (15 శాతం), వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కేసులు 8,406 (31 శాతం) పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే మహిళలపై దాడుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ను ఆంధ్రప్రదేశ్ క్రాస్ చేసిందని అజయ్ మిశ్రా వెల్లడించారు.
కాగా... ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కేంద్రప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో అప్పుల భారం ఏడాదికేడాది భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2018లో రూ.2,29,333.8 కోట్ల అప్పులు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,98,903.6 కోట్లకు పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2017-18లో రుణ శాతం 9.8 శాతం తగ్గిందనీ, ఇప్పుడు అది 17.1 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జీఎస్డీపీలో 42.3 శాతం ఉన్న అప్పుల భారం 2015లో 23.3 శాతానికి తగ్గింది.
Also REad: అప్పుల ఊబిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.. ఒక్కొక్కరిపై ఎంత అప్పువుందంటే..?
2021 నాటికి ఇది జీఎస్డీపీలో 36.5 శాతానికి చేరుకుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ అప్పులను పెంచుతోందనీ, ఇది ఆరోగ్యకరమైన ధోరణి కాదని ఆయన అన్నారు. మొత్తం జీఎస్డీపీలో 25 శాతం కంటే తక్కువ రుణాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిలో ఉన్నాయని మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.
మార్చి 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.3,07,672 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ.62,059గా ఉందన్నారు. ఏపీ అప్పు-జీఎస్డీపీ నిష్పత్తి 31.7 శాతానికి చేరుకుందని వివరించారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తలసరి రుణాన్ని లెక్కించినట్లు మంత్రి తెలిపారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల సంఖ్య మాత్రమే. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, కార్పొరేషన్ రుణాలు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు తదితరాలు కలిపితే వాటి సంఖ్య కనీసం మూడు రెట్లు పెరుగుతుంది.