జనసేన ప్రచార రథాలపై రాళ్లదాడి, పలువురికి గాయాలు: వైసీపీ కార్యకర్తలేనంటూ పోలీసులకు ఫిర్యాదు
ఈ రాళ్లదాడిలో ఇద్దరు జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో వారిని జీజీహెచ్ కు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తమ ప్రచార రథాలపై దాడికి పాల్పడ్డారంటూ జనసేన నేతలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఎన్నికల ప్రచార రథాలపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. గుంటూరులోని ఏటీ అగ్రహారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ రాళ్లదాడిలో ఇద్దరు జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో వారిని జీజీహెచ్ కు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తమ ప్రచార రథాలపై దాడికి పాల్పడ్డారంటూ జనసేన నేతలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రచారరథాలను అడ్డుకోవాలని చూస్తే వైసీపీ నేతల ప్రచారాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు.
జనసేన ప్రచార రథాలపై ఒక్కసారిగా రాళ్లదాడికి దిగడం గుంటూరు రాజకీయాల్లో కలకలం రేపింది. మరి జనసేన ప్రచార రథాలపై రాళ్లదాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తల లేక ఎవరిపనైనానా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.