సంగం డెయిరీ కేసులో అరెస్టు: ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట
సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. నరేంద్రకు కోవిడ్ లక్షణాలున్నాయని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు.
అమరావతి: సంగం డెయిరీ కేసులో అరెస్టైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఎండీ గోపాలకృష్ణకు కరోనా వైరస్ సోకిందని నరేంద్ర తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. నరేంద్రకు, గురునాథంకు కోవిడ్ లక్షణాలున్నాయని న్యాయవాదులు చెప్పారు. దాంోత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి నరేంద్రకు కోవిడ్ పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేసించింది.
కోవిడ్ లక్షణాలుంటే గోపాలకృష్ణను చేర్చిన ఆస్పత్రిలో గానీ మరేదైనా అస్పత్రిలో గానీ నరేంద్రను చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే తాము చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.
ఇదిలావుంటే ధూళిపాళ్లను విడుదల చేయాలని డీవీసి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. కరోనా సెకండ్ వేవ్ ప్రబలి హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు లకు పాల్పడడం సరికాదని చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉన్న డివిసి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది నిరసన, ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ధూళిపాళ్ళ జైల్లో అనారోగ్యానికి గురయ్యాడని తెలుసుకున్న వైద్యులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి హాస్పటల్ ప్రధాన ద్వారం రహదారి ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే ధూళిపాళ్ల ఆరోగ్య స్థితిగతులపై ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఎండి. గోపాలకృష్ణన్ ఆరోగ్య పరిస్థితిని కూడా పారదర్శకంగా తెలియజేయాలని, అక్రమ అరెస్టులు ఎత్తివేసి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.