తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి.

తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా.. విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే ఏసీబీ కోర్టు జారీచేసిన జ్యూడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే గత వారం ఈ పిటిషన్‌పై విచారణ  చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా  సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. 

ఈ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు  తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు ప్రారంభించారు. హరీష్ సాల్వే  వర్చువల్‌గా తన వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్దమని హరీష్ సాల్వే అన్నారు. 

మరోవైపు సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. అయితే ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.