జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మహిళా కమిషన్ ఈ నోటీసు జారీ చేసింది. పవన్ తన వ్యాఖ్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. సమాధానం ఇవ్వకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. వాలంటీర్లు హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందని పవన్ కల్యాణ్‌ అంటున్నారని.. దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రజలపై ఉందన్నారు. 

పవన్ చెప్పిన లెక్కలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని.. ఆధారాలతో కూడిన వివరాలు ఇవ్వకపోతే మహిళలకు క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. లేకపోతే మహిళా కమిషన్ వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు. అలా కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదని అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని మాట్లాడితే.. మహిళా కమిషన్ రియాక్ట్ అవుతుందని చెప్పారు. మహిళా వాలంటీర్లకు, ఒంటరి మహిళలకు అండగా నిలబడుతుందని తెలిపారు. మహిళల 

పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర రెండో దశను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తన వాలంటీర్ వ్యవస్థ పేరుతో మద్యం అమ్మకాల ఆదాయంతో రూ.30 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేస్తారని విమర్శించారు. వైసీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్ల పాలనలో దాదాపు 29 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు. వారిలో 14 వేల మంది ఇళ్లకు చేరారు, మిగిలిన 15 వేల మంది మహిళల ఆచూకీ ఎక్కడ? అని ప్రశ్నించారు. 

వైసీపీ పాలనలో వాలంటీర్లు.. గ్రామంలో ఎంత మంది ఉన్నారు? మహిళలు ఎందరు? వితంతువులు ఎంత మంది ఉన్నారు? అనే వివరాలను ఆరాతీసి ఒంటరి మహిళకు సంబంధించిన సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ మానవ అక్రమ రవాణా జరుగుతోందని న్యూఢిల్లీలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు తనతో చెప్పారని అన్నారు. ఇందులో వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పి.. ఈ విషయాన్ని ఏపీలో ప్రజలకు చెప్పమని అన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు, బాలికలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రమాదంలో ఉన్నారని అన్నారు. 

రాష్ట్రంలో నిషేధం విధిస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.1.27 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని.. అయితే రూ. 97 వేల కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వం చూపుతోందన్నారు. మిగిలిన రూ.30 వేల కోట్లు జేబులో వేసుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆ డబ్బునే ఓట్ల కొనుగోళ్లకు వినియోగిస్తారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.