AP PRC Issue: చర్చలకు నో.. ప్రభుత్వ కమిటీకి లేఖ పంపనున్న పీఆర్సీ సాధన సమితి..!
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వివాదం (AP PRC Issue) ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఉద్యోగులతో సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ కమిటీకి ఉద్యోగుల తరఫున లేఖను పంపాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వివాదం (AP PRC Issue) ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఉద్యోగులతో సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ కమిటీకి ఉద్యోగుల తరఫున లేఖను పంపాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. నేడు జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని PRC సాధన సమితి లేఖలో కోరనుంది. పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ సాధన సమితి ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఉద్యోగులు చర్చలకు రావాలని ప్రభుత్వ కమిటీ ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ ద్వారా ఉద్యోగ సంఘాలకు సమాచారం కూడా చేరవేశాయి. సోమవారం ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం సచివాలయంలో రెండు గంటలకు పైగా వేచి చూసిన ప్రభుత్వ కమిటీ సభ్యులు.. నేడు కూడా ఉద్యోగుల సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. అయితే పీఆర్సీ సాధన సమితి సభ్యులు మాత్రం చర్చలకు వెళ్లకూడదని నిర్ణయానికి వచ్చారు.
అయితే ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం పంపుతున్న నేపథ్యంలో.. ఆ దిశగా స్పందించకపోతే వ్యతిరేక భావన వస్తుందని పీఆర్సీ సాధన సమితి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీఆర్సీ సాధన సమితి.. చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వ కమిటీకి లేఖ ద్వారా తమ కోరికలను తెలియజేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. తద్వారా ప్రభుత్వ కమిటీకి తమ సమస్యలను తెలియజేసినట్టు అవుతుందనే ఆలోచనలో పీఆర్సీ సాధన సమితి ఉంది.