వాలంటీర్లపై  పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై  ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. వాలంటీర్లంటే  పవన్ కళ్యాణ్ కు వణుకు పుట్టిందన్నారు.

అమరావతి: మహిళల మిస్సింగ్ కు, మహిళల అక్రమ రవాణకు తేడా తెలుసా అని పవన్ కళ్యాణ్ ను మంత్రి రోజా ప్రశ్నించారు. మంగళవారంనాడు తాడేపల్లిలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ అంటేనే పవన్ వణుకు అనుకున్నామన్నారు.కానీ వాలంటీర్లను చూసి కూడా పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎవరూ సంతోషంగా ఉండకూడదనే దరిద్రపు ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నారు. మహిళలు, వాలంటీర్లంటే పవన్ కళ్యాణ్ చులకనగా మాట్లాడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను కేంద్రం, పలు రాష్ట్రాలు అభినందించాయని ఆమె గుర్తు చేశారు. దత్తపుత్రుడితో చంద్రబాబు విషం చిమ్మిస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. గతంలో కూడ చంద్రబాబు ఇలానే వ్యాఖ్యలు చేశారన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు దోహదంచేస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ కు ఈ రిపోర్టు ఎవరిచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. 

మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ లేనేలేదన్నారు. ఎస్‌సీఆర్‌బీ డేటాలో టాప్ ఆరో స్థానంలో తెలంగాణ ఉందని చెప్పారు. మహిళ మిస్సింగ్ కేసుల్లో టాప్ టెన్ జాబితాలో లేని ఆంధ్రప్రదేశ్ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు. మహిళల మిస్సింగ్ లో టాప్ టెన్ జాబితాలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం గురించి ప్రశ్నించే దమ్ముందా అని ఆమె పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. అదే చేస్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ను కేసీఆర్ మక్కెలిరగదీస్తారన్నారు.

తన తల్లిని, తన భార్య గురించి వైసీపీ నేతలు ఇష్టారీతిలో మాట్లాడారని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడిందెవరో తెలియదా అని పవన్ కళ్యాణ్ ను మంత్రి రోజా ప్రశ్నించారు. ఈ విషయమై టీడీపీ నేతలనుద్దేశించి పవన్ కళ్యాణ్ 2018లో సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్లను మంత్రి రోజా మీడియా సమావేశంలో చూపారు. తన తల్లిని తిట్టిన వారినే గెలిపించమని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రాధేయ పడుతున్నారని రోజా విమర్శించారు. జనసైనికుల గురించి ఇష్టారీతిలో మాట్లాడిన బాలకృష్ణ ఇంటర్వ్యూకు కాళ్లు ఊపుకుంటూ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారన్నారు.

ప్యాకేజీ కోసం, రాజకీయం కోసం నీ తల్లిని, నిన్ను, జనసైనికులను తిట్టిన వారిని వెనకేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై తాము పోరాటం చేశామని రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయాలపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు.

also read:జనవాణిలో ఫిర్యాదులు, వాలంటీర్లపై కోపం లేదు: పవన్ కళ్యాణ్

రూ. 2.25 లక్షల కోట్లను రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా లంచం లేకుండా వాలంటీర్లు ప్రజలకు అందించారన్నారు. రాష్ట్రప్రజలు జగన్ ను దేవుడిగా కొలుస్తున్నారన్నారు. నీవు జగన్ ను గౌరవిస్తే ఎంత అని మంత్రి రోజా చెప్పారు.దమ్ముంటే జగన్ పై రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. 50 ఏళ్లు దాటినా కూడ ఎమ్మెల్యేగా కూడ పవన్ కళ్యాణ్ గెలవలేదన్నారు. కానీ నీ కంటే తక్కువ వయస్సులోనే సీఎంగా జగన్ పనిచేస్తున్నారన్నారు.