ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఓ రైతు తన సమస్యలు చెప్పుకుంటూ వుండగా.. మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఏయ్ నోరు మూసుకో’’అంటూ గద్దించారు.  

వైసీపీ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల కాలంలో జనంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు చెప్పుకుందామని వస్తే మంత్రిగారు నోరుపారేసుకుంటున్నారు. తాజాగా ఆయన రైతులపై తన ప్రతాపం చూపించారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు నిండా మునిగిపోయారు. చేతికందిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రెండ్రోజులుగా పర్యటిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరు, నాచుగుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రైతు తన సమస్యలు చెప్పుకుంటూ వుండగా.. మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఏయ్ నోరు మూసుకో’’అంటూ గద్దించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALso Read: అరెస్ట్ భయంతోనే జనంలోకి.. ఏం చేసినా జైలుకెళ్లడం ఖాయం : చంద్రబాబుపై మంత్రి కారుమూరి విమర్శలు

ఇదిలావుండగా రెండ్రోజుల క్రితం రైతులను ఎర్రిపప్పా అంటూ కారుమూరి మాట్లాడటంపై పెద్ద దుమారం రేగింది. రైతులకు అండగా నిలబడాల్సిన మంత్రే.. ఇలా మాట్లాడటం ఏంటంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఈ నెల 6న తణుకు మండలం వేల్పూరులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు కారుమూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఓ రైతు తన పరిస్థితిని చెప్పుకుంటుండగా.. దానికి ‘‘ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తా’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై మంత్రి కారుమూరి వివరణ ఇస్తూ.. ఎర్రిపప్ప అనేది తిట్టు కాదన్నారు. దీనికి ‘‘బుజ్జి నాన్న’’ అని అర్ధం వుందని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు దీనిపైనా ట్రోలింగ్ మొదలెట్టారు.