వీఆర్వోలు సచివాలయానికి వస్తే తరమండి - ఏపీ మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు
ఏపీ మంత్రి అప్పలరాజు వీఆర్వోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వీఆర్వోలు మండిపడుతున్నారు.
ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు వీఆర్వోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. వీఆర్వోలను సచివాలయానికి రానీయకండని, వస్తే తరమివేయాలని సూచించారు. దీనిపై ఏపీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
రాజకీయం చేయడానికి ఇక్కడికి వచ్చారా అంటూ ఆగ్రహం..
శ్రీకాకులం జిల్లా కాశిబుగ్గలో వన్ టైం సెటిల్ మెంట్ అమలు జరిగే విధానంపై సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ సమావేశానికి ఆ జిల్లా కలెక్టర్ శ్రీకేష్తో పాటు స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ టి.రాజగోపాల్రావు
ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే సమావేశానికి ముందు అక్కడే ఉన్న వీఆర్వోలపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి అంటూ ఆదేశించారు. దీంతో వీఆర్వోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిలిచి అవమానించడం సరైంది కాదంటూ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్రావుకు బదులిచ్చారు.
కొంత సమయం తరువాత అక్కడికి మంత్రి సీదిరి అప్పల రాజు వచ్చారు. తమకు జరిగిన అవమానాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు వీఆర్వోలు ప్రయత్నించారు. మంత్రి కూడా మున్సిపల్ కమిషనర్ కే అనుకూలంగా మాట్లాడారు. ఈ సమావేశానికి మీరు రాజకీయం చేయడానికే వచ్చారా ? లేదా ఉద్యోగం చేయడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీఆర్వోలు అసంతృప్తికి గురయ్యారు. మళ్లీ వన్టైం సెటిల్మెంట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అప్పలరాజు మాట్లాడారు. ఇందులో వీఆర్వోల విషయం కూడా ప్రస్తావించారు. రేపటి నుంచి వీఆర్వోలు సచివాలయానికి రానీయకండని, వస్తే తరిమి కొట్టాలని స్థానికులకు సూచించారు. దీనిని స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు గమనించాలని అన్నారు. అనంతరం తహసీల్దార్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్లు వీఆర్వోలను కూడా ఆపలేకపోతున్నారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు తహసీల్దార్లు ఎందుకని మండిపడ్డారు.
ఉద్యోగ సంఘాల మండిపాటు..
మంత్రి సీదిరి అప్పల రాజు వీఆర్వోలపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా వీఆర్వోల సంఘం దీనిపై తీవ్ర అసంతృప్తిగా ఉంది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రోజు ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలపాలని వీఆర్వోలకు సూచించాయి. మంత్రి వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని వీఆర్వోల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వీర్వోలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.లేకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వీఆర్వోలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నాయకులు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ తీరును మార్చుకోవాలని అన్నారు. వీఆర్వోలను చిన్నచూపు చూస్తే ఊరుకోబమని చెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీఆర్వోలకు కొంత అసంతృప్తి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.