బైజూస్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై  పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.  అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడాలని పవన్ కళ్యాణ్ కు ఆయన సూచించారు.

విశాఖపట్టణం: రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్ ఒప్పందంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.విశాఖపట్టణంలో ఆదివారంనాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. బైజూస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఏ అంశంపైనా సరిగా స్టడీ చేయడకుండా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బైజూస్ సంస్థకు ప్రభుత్వం ఎలాంటి నగదు చెల్లించడం లేదన్నారు.

 బైజూస్ స్టడీ మెటీరియల్ కోసం ఎవరైనా డబ్బులు చెల్లించారా అని మంత్రి ప్రశ్నించారు.అన్ని విషయాలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అని ఆయన ప్రశ్నించారు.

మీ పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా అని పవన్ కళ్యాణ్ నుద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తనపై అవినీతి ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ నిర్వహించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 

సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడిగే దమ్ము టీడీపీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు.ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ రావాలన్నదే తమ డిమాండ్ అని ఆయన చెప్పారు.ఈ విషయమై బీజేపీ నేతలను ప్రశ్నించాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు. దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కూడ తాము పోరాటం చేస్తున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.