యువగళం పాదయాత్రలో తనపై  లోకేష్ చేసిన విమర్శలకు  ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. 

గుంటూరు: టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో అధికారంలోకి రాదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. శుక్రవారంనాడు గుంటూరులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్ అంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. 
 లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగిదేమీ లేదన్నారు . 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తన కుటుంబ సభ్యులు ఏ రోజూ రాజకీయ కార్యక్రమాల్లో లేరని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలోనే తన సోదరుడు, బిడ్డలు, అల్లుళ్లు వస్తారన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే వారు వెళ్లిపోతారని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల సమయంలో తన కుటుంబ సభ్యులు మరోసారి వస్తారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.లోకేష్‌కు సరిగా తెలుగు కూడ మాట్లాడడం రాదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కొడుకుగా మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యాడన్నారు. ముందు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆయన లోకేష్ కు సూచించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీఎం జగన్ చెడగొడుతున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును జగన్ నిలబెట్టారన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే నైజం కన్నా లక్ష్మీనారాయణదన్నారు. టీడీపీలోకూడ కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ రోజులు ఉండడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.