Asianet News TeluguAsianet News Telugu

రణరంగంగా మారిన కౌన్సిల్... ద్రవ్యవినిమయ బిల్లుకు దక్కని ఆమోదం

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది

AP Legislative Council Adjourned Without Passing Appropriation Bill 2020
Author
Amaravathi, First Published Jun 17, 2020, 10:10 PM IST

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. మూడు రాజధానుల బిల్లప్పుడు అధికార విపక్షాలు ఎలా  ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయో.... ఈసారి కూడా అదే విధముగా అధికార ప్రతిపక్షాలు మరోసారి వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుని అదే సీన్ ను రిపీట్ చేసాయి.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని సభలో టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే దానికంటే ముందే రాజధాని బిల్లులను పరిగణనలోకి తీసుకోవాలని చైర్మన్‌ను అధికార వైసీపీ కోరింది. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వదం జరిగింది.

అజెండా ప్రకారం వెళ్లాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.అంతకుమునుపు కూడా సభలో ఏ బిల్లు ముందు పెట్టాలన్న విషయంలో ఆర్ధికమంత్రి బుగ్గన, మండలి ప్రతిపక్షనేత యనమల, మంత్రి బొత్స మధ్య తీవ్రమాటల యుద్ధం జరిగింది. 

అన్నిటికంటే ముఖ్యమైనది, అత్యవసరమైనది ద్రవ్య వినిమయ బిల్లు కాబట్టి దాన్నే చర్చకు తీసుకురావాలని, అది గనుక పాస్ కాకపోతే ప్రభుత్వం డబ్బులు డ్రా చేయలేదు కాబట్టి దాన్ని చర్చకు తీసుకురావాలని యనమల అన్నారు.

కొత్త సాంప్రదాయాలు ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లును గనుక ముందుగా చర్చకు తీసుకుంటే... అది అయిపోగానే సభను నిరవధిక వాయిదా వేసే ప్రమాదం ఉందని వైసీపీ భావించి ముందుగా సీఆర్డీఏ రద్దు బిల్లును, పాలనావికేంద్రీకరణ బిల్లును చర్చకు స్వీకరించాలని కోరాయి.

సభలో ముందు రాజధాని బిల్లులు పెట్టాలని ప్రభుత్వం, ద్రవ్య వినిమయ బిల్ పెట్టాలని ప్రతిపక్షం ఒకదానికొకటి పట్టుబట్టాయి. వీరి మధ్య తీరా వాగ్వివాదంతోపాటుగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, ముష్టిఘాతాలు కూడా విసురుకున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీలు సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర, మంత్రి వెల్లంపల్లిల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. మొత్తానికి మరోమారు మండలి వాతావరణం రణరంగంగా మారడంతో చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ... తాము మూడు గంటల పాటు ద్రవ్యవినిమయ బిల్లు పెట్టాలని సభలో కోరింది. లైవ్ ప్రసారాలు ఆపి టిడిపి డిమాండ్ బయటకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది.

మధ్యాహ్నం నుంచి 18 మంది మంత్రులు మండలిలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని... దాడికి వస్తుంటే చేతులు అడ్డుపెట్టిన లోకేశ్‌పై ఫోటోలు తీసారంటూ అబ్ధమాడారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు.

మంత్రులపై దాడి జరిగిందంటున్న ప్రభుత్వం వీడియో పుటేజీలు భయటపెట్టాలని, ఉన్నది ఉన్నట్లు వీడియోలు విడుదల చేయాలని మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కోరారు. సభలో మంత్రులు జిప్ తీయడం, తొడ కొట్టడం ఎక్కడా చూడలేదని... మంత్రులపై మేం దాడి చేయలేదని వారే వచ్చి ప్రతిపక్ష సభ్యులపై వచ్చి దాడి చేశారని దీపక్ తెలిపారు.

సభలో మంత్రి అనిల్ ప్యాంట్ జిప్ తీసే ప్రయత్నం చేశారని, మండలి లైవ్ ఎందుకు ఇవ్వడం లేదని... ఇవాళ జరిగిన ఘటన వీడియోలు ఎడిట్ చేయకుండా విడుదల చేయాలని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. కాగా మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios