2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లోనూ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) ఈ విద్యా సంవత్సరం (2022-23) ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలను (inter first year admissions) ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాలల్లో తొలి ఏడాది ప్రవేశాల కోసం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు మొదలవుతాయని ప్రభుత్వం చెప్పింది. దరఖాస్తుల స్వీకరణకు జులై 20ని ఆఖరి తేదీగా నిర్ణయించింది.
జూన్ 27 నుంచి అడ్మిషన్లు మొదలు పెట్టి.. జులై 20వ తేదీతో పూర్తి చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జులై ఒకటవ తేదీ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొంది. కాగా, ఈ నెల తొలి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 4 లక్షల 14 మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 6.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీనిపై కొన్ని విమర్శలు రావడంతో.. సప్లిమెంటరీ పరీక్షలను సైతం ప్రభుత్వం వేగంగా నిర్వహిస్తోంది.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. రెండేళ్ల సాధారణ ఇంటర్మీడియట్తో పాటు ఒకేషనల్ కోర్సుల్లోనూ విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించనున్నారు. జులై 1 నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్ధులందరికీ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశపరీక్షలు నిర్వహించరాదని, ఒకవేళ ఏ కాలేజీ అయిన పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
