సీబీఐకి వైఎస్ వివేకా హత్య కేసు ఎందుకంటే...: జడ్జి చెప్పిన కారణం ఇదీ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు ఇచ్చింది
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు ఇచ్చింది.ఏడాది పాటు సిట్ విచారణ జరిపినా ఏమీ తేల్చలేకపోయిందని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో అంతర్ రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. అంత రాష్ట్రనిందితులను పట్టుకొనే శక్తి సామర్థ్యాలు సీబీఐకు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.పులివెందుల పోలీస్ స్టేషన్ నుండి విచారణను ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది.
ఏడాది పాటుగా దర్యాప్తు చేస్తున్నా సిట్ ఏమీ తేల్చలేకపోయిందని వ్యాఖ్యానించింది. పులివెందుల పోలీసు స్టేషన్ నుంచే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. సిబీఐ సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది.
Also read:వైఎస్ వివేకా కేసు: సీబీఐకి అప్పగింతకు అభ్యంతరాలున్నాయా హైకోర్టు ప్రశ్న
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గత ఏడాది మార్చి 14వ తేదీన హత్యకు గురయ్యాడు. తన నివాసంలోనే ఆయనను హత్య చేశారు. ఈ హత్యపై చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో సిట్ ఏర్పాటు చేసింది. ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా ఎన్నికయ్యాక మరో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ ప్రస్తుతం విచారణ చేస్తోంది. ఈ విచారణ తుది దశలో ఉంది.
మరో వైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి కూతురు సునీత, వివేకానందరెడ్డి భార్య, టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి,మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలను విన్న ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది.
అయితే సీట్ విచారణ తుది దశలో ఉన్నందున సీబీఐ విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టుకు ప్రభుత్వం తరపున ఏజీ చెప్పారు. ప్రభుత్వం వాదనను, పిటిషనర్ల వాదనలను విన్న హైకోర్టు చివరకు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగిస్తే మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు గతంలో ప్రశ్నించింది. అయితే సిట్ విచారణ చివరి దశలో ఉన్నందున సిబీఐ విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే పిటిషనర్ల తరపు న్యాయవాదులు మాత్రం సిట్ విచారణ సక్రమంగా సాగడం లేదని అభిప్రాయపడ్డారు. సీబీఐ విచారణకు అప్పగిస్తే న్యాయం జరుగుతోందన్నారు.
మరో మూడు రోజుల్లో వివేకానందరెడ్డి హత్యకు గురై ఏడాది పూర్తి కానుంది. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది.
గత ఏడాది ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని టీడీపీ, వైసీపీలు ప్రస్తావించాయి. అయితే ఆ సమయంలో హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని వాడుకోవడం నిలిపివేశాయి.