మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో అఖిలప్రియను, భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు అఖిలప్రియ, భార్గవ్ రామ్‌లకు కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భార్గవ రామ్‌ బెయిల్‌పై ఈ రోజు హైకోర్టులో సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే భార్గవ రామ్‌కు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. 

అసలేం జరిగిందంటే.. నారా లోకేష్ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గం చేరుకున్న సమయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసుకున్నాయి. అదే కొత్తపల్లి వద్దకు లోకేష్ పాదయాత్ర చేరుకున్న సమయంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. ఘర్షణకు దారితీసింది. అఖిలప్రియ వర్గీయుల దాడిలో ఏపీ సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. సుబ్బారెడ్డి కారులో ఎక్కించి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలు అయ్యాయి. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో అఖిలప్రియ అక్కడే ఉన్నారు.