సోమవారం నుంచి ఏపీలో ఒంటిపూట బడులు.. టైమింగ్స్ ఇవే, టెన్త్ పరీక్షలూ అప్పుడే
ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పిల్లలకు ఒంటి పూట బడులు ఇవ్వాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు. హాఫ్ డే స్కూళ్లు ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసునని.. ఇప్పటి వరకు ఎండల తీవ్రత లేదన్న కారణంతోనే తాము నిర్ణయం తీసుకోలేదని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణ శాఖ నివేదిక ఆధారంగా ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకున్నట్లు బొత్స స్పష్టం చేశారు.
మరోవైపు.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 3 నుంచే ప్రారంభమవుతాయని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయమని.. విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3,449 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. 6.69 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సరైన కారణం ఉంటే తప్పించి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో వచ్చిన లీకేజ్ ఆరోపణలకు సంబంధించి టీచర్లపై జారీ చేసిన సర్క్యూలర్ను వెనక్కి తీసుకున్నామని బొత్స తెలిపారు.