దుర్గగుడి ఈవో సురేశ్ బాబు బదిలీపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ మేరకు రాజమండ్రి ఆర్జేసీగా బాధ్యతలు చేపట్టవద్దని సురేశ్ బాబుని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం

దుర్గగుడి ఈవో సురేశ్ బాబు బదిలీపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ మేరకు రాజమండ్రి ఆర్జేసీగా బాధ్యతలు చేపట్టవద్దని సురేశ్ బాబుని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. తదుపరి పోస్టింగ్ ఇచ్చే వరకు ప్రభుత్వం వద్ద రిపోర్ట్ చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

రాజమండ్రి ఆర్జేసీ 2గా అన్నవరం దేవస్థానం ఈవో త్రినాథరావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. దుర్గగుడి ఈవోగా వుండగా సురేశ్ బాబు అక్రమాలు, అవకతవకలపై మీడియాలో కథనాలు వచ్చాయి.

దీంతో దుర్గగుడి ఈవో బాధ్యతల నుంచి ఆయనను తప్పించించి ప్రభుత్వం. రాజమండ్రి ఆర్జేసీగా పోస్టింగ్ ఇచ్చినా దానిని కూడా నిలిపివేస్తూ.. సురేశ్‌ బాబుపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

Also Read:అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక: దుర్గగుడి ఈవో సురేశ్‌పై బదిలీ వేటు

ఇంద్రకీలాద్రి ఆలయానికి ఈఓగా సురేష్ బాబు నియామకం అయినప్పటి నుంచి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయ్‌. తరచూ ఏసీబీ, విజిలెన్స్ దాడులు జరుగుతుండగా.. వాటి నివేదికతో ఆయనపై వేటు పడేందుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

ఫిబ్రవరి 18 నుంచి 20 వరకూ మూడు రోజులపాటు దుర్గగుడిలో సోదాలు చేపట్టింది ఏసీబీ. భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టుగా నివేదిక రెడీ చేసి ప్రభుత్వం, దేవాదాయశాఖకు ఇచ్చింది. టెండర్లు, కొటేషన్లు, సామాగ్రి కొనుగోళ్లు, మెటీరియల్ సరఫరాలపై ఫ్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా.. ఈఓ సురేష్‌ బాబు చెల్లింపులు చేశారు.

శానిటరీ టెండర్లను సెంట్రల్ విజిలెన్స్‌ నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్‌కు అప్పగించారాయన. తక్కువ సొమ్ముకు కోట్ చేసిన స్పార్క్‌ కంపెనీని కాదని ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారని ఏసీబీ నివేదిక ఇచ్చింది.