ఆన్లైన్లో టికెట్ల అమ్మకం: జగన్ సర్కార్ దూకుడు, 20న కీలక సమావేశం.. వీరికి ఆహ్వానం
ఆన్లైన్ టికెట్ల విక్రయాలపై చర్చించేందుకు సినీ నిర్మాతలు, డిస్ట్రిట్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను సమావేశానికి ఆహ్వానించింది ఏపీ సర్కార్. ఆన్లైన్లో టికెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు సలహాలు తీసుకోనుంది.
ఆన్లైన్ టికెట్ల విక్రయాలపై చర్చించేందుకు సినీ నిర్మాతలు, డిస్ట్రిట్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను సమావేశానికి ఆహ్వానించింది ఏపీ సర్కార్. ఆన్లైన్లో టికెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు సలహాలు తీసుకోనుంది. ఆన్లైన్ టికెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైమ్లో ట్రాన్స్ఫర్ చేస్తామని ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు , సినీ ప్రముఖులు, థియేటర్ యాజమాన్యాలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
కాగా, సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నిర్ణయించిన ధరకే టికెట్లను ఆన్లైన్లో ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేస్తోందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని పేర్ని నాని మండిపడ్డారు.
ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేయడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరగాలని పేర్ని నాని తెలిపారు. నిబంధనలకు లోబడే షోలు ప్రదర్శించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పని అంటూ నాని మండిపడ్డారు. 2002లోనే ఆన్లైన్ టికెట్ల వ్యవస్థపై కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందని పేర్ని నాని గుర్తుచేశారు.