ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది.  ఈ క్యాంపుల్లో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపుల్లో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం గ్రామ , వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు.. ఈ క్యాంపుల్లో అందించే సేవలకు ఎలాంటి రుసుములను వసూలు చేయబోమని పేర్కొంది.

అయితే, మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ‘‘జగనన్నకు చెబుదాం’’కు అనుబంధంగా సమస్యల పరిష్కారానికి ఈ నాలుగు వారాల పాటు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 24 నుంచి ఈ కార్యక్రమంపై వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని ప్రభుత్వం చెప్పింది. 

క్యాంపుల్లో అందించే సేవలు , జారీ చేసే సర్టిఫికెట్లు ఇవే :

  • కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు
  • డేట్‌ ఆఫ్‌ బర్త్‌, డెత్ సర్టిఫికేట్లు
  • మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌
  • మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్‌
  • మ్యారేజ్ సర్టిఫికెట్ 
  • ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు
  • ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌
  • కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)
  • కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన
  • కుటుంబ వివరాల్లో సభ్యుల పేర్ల తొలగింపు 
  • వినతుల స్వీకరణ, రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్