ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 81,85 జీవోలను ఇటీవలే హైకోర్టు కొట్టేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తున్నామని... 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకుంటున్నారని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
read more ఇంగ్లీష్ మీడియంపై జగన్ సర్కార్ సర్వే... తల్లిదండ్రుల అభిప్రాయమిదే
ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బిజెపి నాయకుడు సుధీష్ రాంభొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఏ మీడియంలో చదవాలనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకే వదిలేయాలని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.
ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే బ్యాక్ లాగ్ లు మిగిలిపోతాయని అన్నారు. అయితే, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని తెలుగుదేశం, జనసేన వంటి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు వాదించారు. అయితే, ఇంగ్లీష్ మీడియం చదివితేనే భవిష్యత్తు ఉంటుందని వైఎస్ జగన్ వాదిస్తున్నారు.