అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. 

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

కాగా.. పాడేరు ఘాట్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు వున్నారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ALso Read: పాడేరు బస్సు ప్రమాదం .. చంద్రబాబు దిగ్భ్రాంతి

మరోవైపు.. పాడేరులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.