ప్రభుత్వ సమాచారం లీక్... ముగ్గురు ఆర్థిక శాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచాారాన్ని లీక్ చేస్తున్నారన్న అనుమానంతో ఆర్థక శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై జగన్ సర్కార్ వేటు వేసింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది జగన్ సర్కార్. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లతో పాటు ఒక అసిస్టెంట్ సెక్రెటరీని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న డి. శ్రీనిబాబు, కే. వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇటీవల ఆర్థిక శాఖకు చెందిన సమాచారం లీక్ అవుతుండటంతో ఉద్యోగులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు ప్రభుత్వ సమాచారని లీక్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారిని సస్పెండ్ చేసింది జగన్ సర్కార్. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని వారిని ప్రభుత్వం ఆదేశించింది.
read more ఏపీ ఆర్ధిక వ్యవహరాలపై పయ్యావుల మరో లేఖ...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ జమాఖర్చులపై పీఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ జమాఖర్చుల నిర్వహణపై ఆయన గురువారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. నలబై వేల కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన చెప్పారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడి ఆదేశాల మేరకు గవర్నర్ ను కలిసి ఆర్థిక శాఖలోని లోపభూయిస్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని, ప్రైవేటు వ్యవస్థను నడపడానికి ఏవిధంగా అకౌంటింగ్ ప్రాసెస్ వుంటుందో..రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కూడా జమా ఖర్చులను ఏ నివేదికలో రూపొందించాలనే విధివిధానాలను దేశంలోని ప్రభుత్వాలు రూపొందించుకున్నాయని ఆయన చెప్పారు.
బ్రిటిషు వారి నుండి వచ్చిన సంప్రదాయాలను మరింత మెరుగుపరచి అకౌంటింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పాటు చేశారని, లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో అవతవకలు జరిగితే పట్టుకోవడానికి విధానాలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్ల జమా ఖర్చులను సరిగ్గా నమోదు చేయలేదన్న అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, తాము చేసేది ఆరోపణలు కాదు.. చాలా రోజులుగా సమాచారాన్ని సేకరించి చెప్తున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోందని, ప్రభుత్వ ఉద్యోగి చిన్న ఖర్చు చేయాలన్నా ఓచర్ రాసి, పది మంది సంతకాలు పెట్టాలని, ఆ తర్వాతే జిల్లా ట్రెజరర్ విడుదల చేస్తారని ఆయన చెప్పారు. ప్రభుత్వ అధికారికి జీతం రావాలన్నా వంద సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని, అలాంటిది.. రూ.41 వేల కోట్లకు పైగా ఎలాంటి బిల్లులు, ఓచర్లు, లావాదేవీల పత్రాలు లేకుండానే నచ్చిన విధంగా వేరే పద్దుల్లోకి మార్చారని పయ్యావుల కేశవ్ అన్నారు.
తాము ఆరోపణలు చేయడం లేదని, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాసిన లేఖను కూడా జతపరిచి ఫిర్యాదు చేశామని, వారి రాసిన లేఖ ప్రకారం రూ.41 వేల కోట్లకు సంబంధించి సరైన పద్దులు లేవని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
బడ్డీ కొట్లు కూడా పద్దులు రాసుకుంటాయని, అలాంటిది రూ.41 వేల కోట్లకు పద్దులు రాయలేదంటే ఏం సమాధానం చెప్తారని పయ్యావుల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేసే ప్రతి చర్య కూడా గవర్నర్ పేరు మీదే జరుగుతుందని, ఆ నిబంధనను కూడా గవర్నర్ కు ఇచ్చిన లేఖలో పొందుపరిచామని ఆయన చెప్పారు. ఆర్టికల్ 151(2) ప్రకారం సీఐజీ వాళ్లు గవర్నర్ ఇస్తే గవర్నర్ శాసనసభకు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏ నివేదికలు ఇస్తే గవర్నర్ ఆవే నివేదికలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని పయ్యావుల అన్నారు.