Asianet News TeluguAsianet News Telugu

ప్రతి నెలా 5వ తేదీలోపే 95 శాతం ఉద్యోగులకు జీతాలు.. ఏపీ ఆర్థిక శాఖ వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 నుంచి 95 శాతం మందికి 5వ తేదీలోపే జీతాలను అందిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

AP Government Clarity On employees Salaries
Author
First Published Jan 22, 2023, 10:30 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 నుంచి 95 శాతం మందికి 5వ తేదీలోపే జీతాలను అందిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులను మానవ వనరులుగా భావిస్తున్నామని.. వారే తమకు పెద్ద ఆస్తి అని పేర్కొంది. రాష్ట్ర విభజన సమస్యలు, కోవిడ్ సంక్షోభం ఉన్నా జీతాలు, పెన్షన్లు ఆపలేదని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ఇందులో పొందుపరిచారు. 

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కోవిడ్ పరిస్థితుల వల్ల ఆర్థికంగా అనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి నెలా 5 తేదీన 90 నుంచి 95 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం చెల్లిస్తున్నట్టుగా వెల్లడించారు. మిగిలిన 5 శాతం మందికి ఖజానాలో బిల్లలు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్టుగా పేర్కొన్నారు.

ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులకు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వగలం అని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లలు 90 నుంచి 95 శాతం వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్ చేస్తారని.. వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5వ తేదీలోగా పూర్తిచేస్తున్నామని చెప్పారు. అందుబాటులో ఉన్న పలు పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నట్టుగా తెలిపారు. గతంలో పద్దతి మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అవాస్తవ ప్రచారాలను, ఆరోపణలను నమ్మాల్సిన పనిలేదని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంలో విఫలమైందన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి వారి అనుమతి లేకుండా డబ్బును విత్‌డ్రా చేస్తోందని ఆరోపించారు. ఈ  నేపథ్యంలోనే 95 శాతం ఉద్యోగులకు ప్రతి నెలా 5వ తేదీలోపే జీతాలు చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios