NTR Vardhanthi: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక : చంద్రబాబు
NTR Vardhanthi:ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
NTR Vardhanthi: ఎన్టీఆర్ 26 వ వర్ధంతి కార్యక్రమాన్ని అమరావతిలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. మహా నేత ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడాడు.
కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు తారక రాముడు అని, ఆయన ఇచ్చిన స్ఫూర్తి తో తెలుగు దేశం పార్టీ నిరంతరం ప్రజల కోసం పని చేస్తోందని చంద్రబాబు తెలిపారు. కథానాయకునిగా... మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నానని తెలిపారు.లక్షల మంది కార్యకర్తలు ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారనీ, ఇప్పటి వరకూ సినిపరిశ్రమలో ఎన్టీఆర్లా ఎవరూ నటించలేరని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. తన జీవితంలో ఎదురైన ప్రతి సవాలునూ సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ప్రధాన ఆయుధాలు నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి అని.. ఆయన కిష్ట పరిస్థితుల్లోనూ సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారనీ, తెలుగు నెల మీద ఎన్నోవ్యవస్థలను సంస్కరించగలిగారని, ఆయన తెలుగుజాతి ముద్దుబిడ్డ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో దొంగలు, దోపిడీదారులు, అహంకార దొరలు లేని అసలైన సర్వజన సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు మనందరం కృషి చేద్దామని నారా లోకేష్ పేర్కొన్నారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.ఎన్టీఆర్ను భారతరత్నతో గౌరవించుకోవాలని ఆయన అన్నారు.
విజయవాడ గొల్లపూడి గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక తెలుగు దేశం నాయకులు నిర్వహించారు. గొల్లపూడి గ్రామ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయవాడ టీడీపీ నాయకులు, పలువురు నేతలు పాల్గొన్నారు.