ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల విమర్శలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు 

రాష్ట్రప్రభుత్వ అప్పులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయని ఆయన తెలిపారు. అప్పులపై విపక్ష నేతల ఆరోపణలు హేయమని బుగ్గన అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ విచ్చలవిడిగా అప్పులు చేశారని ఆయన గుర్తుచేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కరోనా కట్టడి కోసం రూ.7,130.19 కోట్లకు పైగా వెచ్చించామని, కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నామని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువేనని, అందుకు రూ.25,914.13 కోట్లు ఖర్చు చేశామని బుగ్గన వివరించారు. అవ్వాతాతలకు ఇంటింటికి రూ.37,461.89 కోట్లను పింఛన్ల రూపంలో అందించామని ఆయన వెల్లడించారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాల కింద రూ.17,608.43 కోట్ల మేర లబ్ది చేకూర్చామని బుగ్గన తెలిపారు.

అనేక పథకాలతో మహిళల స్వయం ఉపాధి మార్గాలకు బాటలు వేశామని ఆయన చెప్పారు. అన్ని రకాలుగా సామాన్యులకు భరోసా కల్పించిన ప్రభుత్వం ఇది అని ఉద్ఘాటించారు. నేరుగా ప్రజల చేతికే డబ్బు అందించడం ద్వారా వస్తువులు, సేవల డిమాండ్ దెబ్బతినకుండా కాపాడలిగామని రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. అనేక కంపెనీలను నిలబెట్టగలిగామని చెప్పారు. తాము ఇంత చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకే టీడీపీ కుట్రలు అని విమర్శించారు. అబద్ధాలు, అసంబద్ధ అంశాలతో టీడీపీ విషప్రచారం చేస్తోందని రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు