Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణపై పెట్టిన దృష్టి ఏపీ పై లేదు, కోతలే: బడ్జెట్ పై చంద్రబాబు విసుర్లు

తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పారించేందుకే ప్రభుత్వం దృష్టిపెట్టిందే తప్ప రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామన్న ధ్యాస లేకుండా పోయిందని విమర్శించారు. సున్నా వడ్డీ రుణాలకు రూ.4వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.100 కోట్లే కేటాయించారంటూ పెదవి విరిచారు. 

ap ex cm chandrababu naidu reacts on ap budget
Author
Amaravathi, First Published Jul 12, 2019, 9:06 PM IST

విజయవాడ: అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముందుచూపులేనిదంటూ అభివర్ణించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించిన చంద్రబాబు అందుకు నిదర్శనమే బడ్జెట్‌ కేటాయింపులేనన్నారు. శ్వేతపత్రంలో ఒకలా చెబుతారు.. బడ్జెట్‌లో మరోలా చెప్తారని విమర్శించారు. 

2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6వేలే ఎక్కువ. అది నేడు రూ.38 వేలుకు చేరుకోవడం తమ ప్రభుత్వ ఘనతేనని చెప్పుకొచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 49వేల ఉద్యోగాలు వచ్చాయనడానికి ప్రభుత్వ లెక్కలే ఆధారమన్నారు. 

ఇరిగేషన్ శాఖకు నిధుల కేటాయింపుల్లో అన్యాయం చేశారని విమర్శించారు. ప్రాజెక్టులకు కోతలు పెట్టి ప్రగతికి గండికొట్టారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌ కేటాయింపుల్లో 22శాతం కోతలు విధించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పారించేందుకే ప్రభుత్వం దృష్టిపెట్టిందే తప్ప రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామన్న ధ్యాస లేకుండా పోయిందని విమర్శించారు. సున్నా వడ్డీ రుణాలకు రూ.4వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.100 కోట్లే కేటాయించారంటూ పెదవి విరిచారు. బీసీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టారని ఆరోపించారు. 139 కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారే తప్ప ఏ కార్పొరేషన్ కు ఎంత నిధులో అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు.  

డ్వాక్రా మహిళలకు రూ.1788 కోట్లే కేటాయించడం సరికాదన్నారు. డ్వాక్రా రుణాల రద్దు, మహిళలకు రూ.75వేల హామీలకు కేటాయింపుల ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఏడాది నుంచి చేస్తామని ఈ బడ్జెట్‌లో చెప్పడం కూడా మరో మోసమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల బడిగా మార్చారని విమర్శించారు. బడ్జెట్‌లో 43లక్షల మంది తల్లులకే లబ్ధి అంటూ పరిమితులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిధులు లేకుండా ఐదేళ్లలో  25లక్షల ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలని నిలదీశారు. 

మద్యాన్ని ప్రభుత్వమే ఎలా విక్రయిస్తుందని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే వ్యాపారం చేస్తూ దశలవారీ నిషేధం ముసుగు ఏమిటో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారని చంద్రబాబు అన్నారు. మద్యం కంపెనీల నుంచి ముడుపుల కోసమేనా నేరుగా మద్యం విక్రయం అంటూ విరుచుకుపడ్డారు. 

రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లు, కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250కోట్లతో పనులు ఎలా చేపడతారో చెప్పాలని నిలదీశారు. స్థిరాస్తిరంగం హైదరాబాద్‌ తరలిపోయింది. లక్షల మంది కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయింపులు లేవంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios