ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 1,620 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, మే 13 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1,620 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ అయిన https://aphc.gov.in/ ద్వారా దరఖాస్తు ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ మే 13, 2025 నుండి ప్రారంభమవుతుండగా, చివరి తేదీ జూన్ 2, 2025గా నిర్ణయించారు.

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అందులో ఆఫీస్ సబార్డినేట్ గా 651, జూనియర్ అసిస్టెంట్ గా 230, కాపీయిస్ట్‌గా 193, ప్రాసెస్ సర్వర్ 164, టైపిస్ట్ 162, స్టెనోగ్రాఫర్ 80, ఫీల్డ్ అసిస్టెంట్ 56, ఎగ్జామినర్ 32, డ్రైవర్ 28, రికార్డు అసిస్టెంట్ 24 పోస్టులు ఉన్నాయి.

పోస్టును బట్టి విద్యార్హతలు భిన్నంగా ఉన్నాయి. కొన్నింటికి ఏడు వ తరగతి ఉత్తీర్ణత సరిపోతే, మరికొన్నింటికి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులుగా పరిగణించబడతారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా https://aphc.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి, అక్కడ ఇచ్చిన సూచనలను అనుసరిస్తూ అప్లై చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు అప్లికేషన్‌ను సమర్పించవచ్చు కానీ చివరి రోజుల్లో సైట్‌లో ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది.

ఈ నియామక ప్రక్రియ ద్వారా అనేక జిల్లాల్లో కోర్టు వ్యవస్థలో అవసరమైన మానవ వనరుల కొరత తీర్చాలని ప్రభుత్వానికి ఉద్దేశం. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా అప్లై చేస్తే, మంచి అవకాశాన్ని దక్కించుకునే వీలు ఉంటుంది.