టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.  గతంలో రాజకోట కుట్రకు ఎన్‌టీఆర్ పదవీచ్యుతుడయ్యారని, మరోసారి అలాంటి తప్పేదో జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. 

ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో చంద్రబాబు బసపై అనుమానాలు వున్నాయన్నారు. గతంలో రాజకోట కుట్రకు ఎన్‌టీఆర్ పదవీచ్యుతుడయ్యారని కోలగట్ల ఆరోపించారు. మరోసారి అలాంటి తప్పేదో జరుగుతుందనే అనుమానం వుందన్నారు. 14 ఏళ్ల తన పాలనా కాలంలో చంద్రబాబు ఏం చేశారో చెప్పకుండానే జిల్లా పర్యటన సాగిందని వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. మా సంగతి తర్వాత కానీ... ముందు కుప్పంలో నువ్వు గెలుస్తావా అని ఆయన ప్రశ్నించారు. మేం అవినీతి చేశామంటున్న నువ్వు... దమ్ముంటే నిరూపించాలని కోలగట్ల సవాల్ విసిరారు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజలు నిన్ను నమ్మరని వీరభద్రస్వామి చురకలంటించారు. 

అంతకుముందు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మాదిరిగా తనకు వేరే రాష్ట్రం, వేరే పార్టీ లేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా తాను అనడం లేదని సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడే నివాసం ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా నది నీళ్లను కడప జిల్లాకు తీసుకు వచ్చారన్నారు. అంతకు ముందు ఎంతమంది సీఎంలున్నా కూడా జిల్లాకు కృష్ణా నది నీళ్లు తేలేదన్నారు.

ALso REad: మేం చిన్నపిల్లలమా, వాళ్లిద్దరూ మాపై స్వారీ చేయడానికి.. చంద్రబాబుకు బొత్స కౌంటర్

వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే కడప జిల్లాలో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో ఎవరూ కూడా ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గాలేరు నగరిని తీసుకువచ్చేందుకు వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టు పూర్తైందన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జిల్లాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని జగన్ చెప్పారు.

చిత్రావతి ప్రాజెక్టులో నీరు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చిత్రావతి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినట్టుగా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయాన్నిఅప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలోని నేతలు కూడా పట్టించుకోలేదని సీఎం జగన్ విమర్శించారు.కడపలో రూ. 8800 కోట్లతో స్టీల్ ప్యాక్టరీని నిర్మించనున్నట్టుగా సీఎం ప్రకటించారు.