బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నంద్యాలలో ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మంత్రి అంజాాద్ బాషా టిడిపి మహానాడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. 

నంద్యాల: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు, అందులో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంపై ఏపీ మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నంద్యాలకు చేరుకుంది. ఇవాళ నంద్యాలలో ప్రారంభమైన ఈ యాత్ర ఇవాళ సాయంత్రం అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది.

నంద్యాలలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ... మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రతి పదవుల్లోనూ 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న ఆయనకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. 

వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ ఒకపక్క బడుగు, బలహీనవర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తూ... మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఆర్థిక స్వావలంభన కల్పిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఒకపక్క కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినా ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు నిలిచి పోకుండా క్యాలెండర్‌ ప్రకారమే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. 

చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడు పేరుతో కొందరు జోకర్లు, బ్రోకర్లను పక్కన పెట్టుకొని ప్రభుత్వాన్ని తిట్టించే ప్రయత్నం చేశారని ఉపముఖ్యమంత్రి అన్నారు. బీసీలు తమ పార్టీకి పేటెంట్‌ అని చెప్పుకునే చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వారి అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. కేవలం బిసీలను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుని గద్దెనెక్కారని అన్నారు.. అంతేకాకుండా మైనార్టీలను చిన్నచూపు చూశారని... అందుకే తన ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు, ఎస్టీలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ఆరోపించారు. 

''చంద్రబాబుకు నంద్యాల ఉప ఎన్నికల్లోనే కనువిప్పు కలిగింది. ఉప ఎన్నికల్లో గెలవాలంటే మైనార్టీ ఓట్లు అవసరం అని గుర్తించిన చంద్రబాబుకు ఎండీ ఫరూక్‌ అప్పుడు గుర్తుకు వచ్చారు. అంతవరకూ వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన పాపాన పోలేదు. అదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలిసారి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా, ఉప ముఖ్యమంత్రిని చేసారు. ఇలా మైనార్టీలకు రాజకీయంగా మంచి స్థానాన్ని కల్పించిన ఘనత జగన్ కే దక్కుతుంది'' అని అంజాద్ బాషా పేర్కొన్నారు. 

''వైసిపి తరపున నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు. శాసనమండలిలోనూ నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక మైనార్టీ మహిళను శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌గా నియమించిన ఘనత కూడా ముఖ్యమంత్రిదే. కాబట్టి మైనార్టీలంతా వైయస్సార్‌ సీపీకి అండగా ఉండాలి'' అని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. 

''రాజకీయ పార్టీలన్నీ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి . రాబోయే రోజుల్లో శ్రీలంక తరహా పరిస్థతి ఏపీలోనూ తప్పదంటూ ఆరోపణలు చేస్తున్నాయి. లక్షా 40 వేల కోట్లు రూపాయలు మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు''అన్నారు

''అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు గౌరవాన్ని ఇచ్చిన ఈ ప్రభుత్వానికి, వైఎస్‌ జగన్‌ కి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వైఎస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే పేదరికం అనేదే ఉండదని స్పష్టం చేస్తున్నాం. బడుగు, బలహీన వర్గాలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది'' అని డిప్యూటీ సీఎం అజాద్ బాషా పేర్కొన్నారు.