YS Sharmila: ఎంత మంది వస్తారో రండి.. చూసుకుందాం.. : నగరిలో షర్మిల సవాల్
వైఎస్ షర్మిల నగరి నియోజకవర్గంలో వైసీపీ పై విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రోజా, వైసీపీ నేతలు, సీఎం జగన్ పైనా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సవాల్ విసిరారు.
![ap congress chief ys sharmila challenge to ycp, slams cm jaganmohan reddy kms ap congress chief ys sharmila challenge to ycp, slams cm jaganmohan reddy kms](https://static-ai.asianetnews.com/images/01hn2697nk9y2avzft95wbhhed/ys-sharmila-jpg_363x203xt.jpg)
YS Sharmila: వైఎస్ షర్మిల నగరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైసీపీపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రోజాపై, వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి.. బాపట్ల నుంచి అవతలికి అడుగుపెట్టనిచ్చామని కొందరు వైసీపీ నేతలు అంటున్నారని షర్మిల అన్నారు. వారి సవాల్ను స్వీకరిస్తున్నట్టుగా తాను ఒక్క నిమిషం రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం.. రండి ఎంతమంది వస్తారో.. అంటూ చాలెంజ్ చేశారు. ఎంత మంది వస్తారో రండి.. చూసుకుందామని, వారి దమ్ము ఏందో చూపెట్టాలని సవాల్ విసిరారు.
నగరిలో స్థానిక ఎమ్మెల్యే రోజాపైనా ఫైర్ అయ్యారు. రోజమ్మా.. అంటూ ఆమెను సంబోధిస్తూ.. నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు పలికారు. తెలంగాణలో తనపై నోరుపారేసుకున్న వారంతా.. ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్నారని వార్నింగ్ ఇచ్చారు. రేపు రేపు.. వీరి పరిస్థితి కూడా ఇంతేనని స్పష్టం చేశారు.
సీఎం జగన్ పైనా ఆరోపణలు గుప్పించారు.రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని, ఆయన ఆశయాల కోసం నిలబడ్డామని చెబుతూ నీచంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఐదేళ్లలో ఇచ్చిన మాటలు అన్నీ తప్పారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు, జగనన్న పరిపాలనకు పోలికే లేదని ఆరోపించారు.
వైసీపీని తాను తన భుజాల పై మోశానని షర్మిల అన్నారు. 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. సమైక్యాంధ్ర కోసం తిరిగారని, ఓదార్పు యాత్ర చేశారని వివరించారు. పార్టీకి ఎక్కడ అవసరం పడితే అక్కడ వాలిపోయానని, ఒక్క పదవి కోసమూ తాను తాపత్రయ పడలేదని పేర్కొన్నారు. వైసీపీ చిన్న మొక్కగా ఉన్నప్పుడు నీళ్లు పోసి, ఎరువు వేసి కాపాడానని వివరించారు. కానీ, ఇప్పుడు చెట్టయ్యాక తన అవసరమే లేదని అంటున్నారు కదా.. అని వాపోయారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.