సారాంశం

తల్లి హఠాన్మరణంతో బాధపడుతున్న గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి తల్లి శివపార్వతి(68) నిన్న(సోమవారం) గుండెపోటుతో మృతిచెందారు. మాతృవియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. 

ఇవాళ ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి నేరుగా గుంటూరుకు చేరుకున్నారు సీఎం జగన్. శ్యామలానగర్ లోని ఎమ్మెల్యే గిరిధర్ ఇంటికి చేరుకుని తల్లి ఫోటోవద్ద నివాళుల అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇలా మద్దాలి గిరిని ఓదార్చిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు సీఎం జగన్.

ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు పోలీసులు. మంగళవారం ఉదయం 7 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగింపు అనంతరం యధావిధిగా ట్రాఫిక్ ను అనుమతించారు. 

సోమవారం ఉదయం ఎమ్మెల్యే గిరిధర్ తల్లి మృతిచెందగా సాయంత్రం అంత్యక్రియలు ముగిసాయి. మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో పాటు వైసిపి నాయకులు , కార్యకర్తలు ఎమ్మెల్యే తల్లి మృతదేహానికి నివాళి అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే తల్లిని కోల్పోయి బాధపడుతున్న ఎమ్మెల్యేను ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఓదార్చారు.