Asianet News TeluguAsianet News Telugu

ఇసుక అక్రమాలకు చెక్... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

నూతన ఇసుక పాలసీ అమల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని ఏపి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

AP CM YS Jagan wants tough action against illegal Sand mining
Author
Amaravathi, First Published Apr 28, 2020, 12:27 PM IST

అమరావతి: నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు ఇసుక పర్యవేక్షణాధికారులు (డీఎస్ఓ)గా మైనింగ్ అధికారులను నియమిస్తున్నట్లు రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.  

ఇప్పటి వరకూ ఈ బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్యవేక్షించేవారు. అయితే అక్రమాలను కట్టడి చేసి, ఇసుక పాలసీలో పారదర్శకతను మరింత పెంచడానికి కీలకమైన ఈ స్థానాల్లో పూర్తి స్థాయి మైనింగ్ అధికారులను నియమించినట్లు మంత్రి తెలిపారు. ఎడి, డిడి స్థాయి అధికారుల నియామకంతో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

ఎపిఎండిసి, మైనింగ్ శాఖల మధ్య సమన్వయంతో ఇసుక విక్రయాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అక్రమాలకు అవకాశం లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళతామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 

ఇసుక మైనింగ్‌లో అవినీతికి, అక్రమాలకు తావులేని విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ ఇదివరకే తెలిపారు. వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం దేశంలోనే రోల్‌మోడల్‌గా నిల్చిందన్నారు. ఈ విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగడానికి వీల్లేదని...చిన్న అవినీతి చోటుచేసుకున్నా మొత్తం వ్యవస్ధకే చెడ్డపేరు వస్తుందన్నారు. 

అక్రమాలు జరక్కుండా పటిష్టంగా పనిచేయాలి... ఆలసత్వం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక మైనింగ్‌ పాలసీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిల్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

 ఇసుక పాలసీ అమలుపై ఆయన జిల్లా కలెక్టర్లకు తన కార్యదర్శి ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేని పారదర్శకమైన, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టువేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామన్నారు. 

అయినప్పటికీ  ''ఎ డర్టీ ఫిష్‌ స్పాయిల్స్‌ ద హోల్‌ పాండ్‌'' అన్న తరహాలో ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అలా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన ఇసుక పాలసీని అమలుచేయాలని, ఎక్కడా అక్రమాలు అన్నవి జరక్కుండా పటిష్టమైన వ్యవస్ధ ఉండాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios