ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(గురువారం) దేశ రాజధాని న్యూడిల్లీకి పయనమయ్యారు. స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన వెంటనే సీఎం డిల్లీకి పయనమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి దేశ రాజధాని న్యూడిల్లీకి పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi), హోంశాఖ మంత్రి అమిత్ షా (amit shah) తో కీలకమైన అంశాలపై చర్చించేందుకే సీఎం డిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో రాజకీయాలపైనా వీరి మధ్య చర్చలు జరిగనున్నాయని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
సీఎం జగన్ హుటాహుటిని డిల్లీకి వెళ్లడానికి ప్రధాన కారణం గత ఆర్థిక సంవత్సరం పరిమితికి మించి రుణాలు తీసుకోవడంపై కేంద్రం అభ్యంతరం తెలపడమే. దీంతో ఇలా పరిమితికి మించి రుణాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రధానికి వివరించి రాష్ట్ర రుణపరిమితిపై సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా సీఎం కోరనున్నారు. ఇందుకోసమే స్వయంగా ప్రధానిని కలిసి ఈ అంశంపై సీఎం జగన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్ 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూడిల్లీకి బయలుదేరతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు దిల్లీ విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుండి రోడ్డుమార్గంలో మధ్యాహ్నం 2.45 గంటలకు 1-జన్పథ్ చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీని కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.42,472 కోట్ల రుణం తీసుకునేందుకు మాత్రమే కేంద్రం అనుమతించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం ఈ పరిమితికి మించి రూ.55 వేల కోట్లను రుణంగా తీసుకుంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖతో పాటు, కాగ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారు. ఈ తరుణంలో ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది,
గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలతో ప్రస్తుతం ఏపీ రుణాల మొత్తం రూ. 4,39,394 కోట్లకు పెరిగింది. మరోవైపు వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రూ. 1,17,503 కోట్ల రుణాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీదారుగా ఉంది. ఈ అంశాలను ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రికీ సీఎం జగన్ వివరించే అవకాశం వుంది.
ఏపీ రుణాలపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కార్యాలయం(CAG),కేంద్ర ఆర్థిక శాఖ తరచూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కూడా కాగ్, పీఏజీ అధికారులు సమావేశమై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తీసుకున్న రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాగ్కు వివరాలు సమర్పించలేనట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నీ ప్రధానికి వివరించి రుణపరిమితి సీలింగ్పై వెసులుబాటు ఇవ్వాల్సిందిగా జగన్ కోరే అవకాశం ఉంది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాల్సిన రూ.2,800 కోట్లను కూడా త్వరితగతిన చెల్లించేలా చూడాలని సీఎం జగన్ ప్రధానిని కోరనున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికల విషయంపై కూడా ప్రధాని మోదీ-ముఖ్యమంత్రి జగన్ల మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
డిల్లీ పర్యటనలో కేవలం ప్రధానినే కాదు అమిత్ షాను కూడా సీఎం జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి చెందిన అంశాలే కాదు ప్రస్తుత రాజకీయ పరిణామాలు వీరిమధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి ఆకస్మికంగా డిల్లీకి పయనమవడం రాజకీయంగా చర్చకు దారితీసింది.