కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో విభేదాలపై సీఎం వైఎస్ జగన్తో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లోని ఆశావహులు ముందుగానే తమకు నచ్చిన నియోజకవర్గాలపై కర్చీఫ్ వేసుకుని కూర్చొన్నారు. అంతేకాదు.. తమ బెర్త్ జోలికి వస్తే ఎవరిని సహించేది లేదని తేల్చిచెబుతున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీ ఏదైనా ఇదే పరిస్ధితి నెలకొంది. అధికార వైసీపీలో ఈసారి చాలా సిట్టింగ్లకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే సంకేతాలు పంపారు. పనితీరు మెరుగుపరచుకోవాలని.. లేని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని హెచ్చిరించారు. వైనాట్ 175 అని జగన్ చెబుతున్నా.. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత లేదు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. దీంతో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు దాడులు చేసుకోవడం వరకు వెళ్లింది. దీంతో విషయం సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది. వెంటనే తాడేపల్లికి రావాల్సిందిగా పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఆయన మంగళవారం రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి సీఎం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.
Also Read: జగన్తో ముగిసిన భేటీ: వేణు పై పిల్లి ఫిర్యాదు, మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ఎంపీ
ఈ క్రమంలో రామచంద్రాపురం పంచాయతీపై జగన్ సీరియస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రామచంద్రాపురం నుంచి బరిలో నిలబెట్టాలనే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు. దీనిపై సీరియస్ అయిన సీఎం.. మీ అబ్బాయిని ఎక్కడ నుంచి నిలబెట్టాలనే బాధ్యత తనదన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన హోదాలో వుండి.. చిన్న విషయాలు పట్టించుకోవడం ఏంటని పిల్లిని జగన్ ప్రశ్నించారట. విభేదాలు పక్కనబెట్టి కలిసి పనిచేసుకోవాలని ముఖ్యమంత్రి హితవు పలికారు.