వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్పై జగన్ సమీక్ష, మూడు దశల్లో అమలు
రాష్ట్రంలో శుభ్రమైన తాగునీటి సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో శుభ్రమైన తాగునీటి సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని.. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్ట్ను శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని ఆదేశించారు.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై నిశిత అధ్యయనం చేసి.. ప్రణాళికలు ఖరారు చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతమున్న తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలని జగన్ ఆదేశించారు.
కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి నేరుగా వారి ఇళ్లకే తాగునీటిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
వాటర్ గ్రిడ్ మూడు దశల్లో భాగంగా.. మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలు.. రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమ జిల్లాలు, మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో శుభ్రమైన తాగనీరు అందించనున్నారు.
నీటిని తీసుకున్న చోటే శుద్ధి చేసి అక్కడి నుంచే పంపిణీ చేయాలని సమావేశంలో జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.