భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

గోదావరి వరద (godavari floods) నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రిలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ... వచ్చే 24 గంటలు అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు. గోదావరి గట్లకు ఆనుకుని వున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. గట్లు బలహీనంగా వున్న చోట గండ్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని అవసరమైన నిత్యాసవర వస్తువులు అందజేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని.. పాముకాటు కేసులు పెరిగే అవకాశం వున్నందున అవసరమైన మందులు అందుబాటులో వుంచాలని జగన్ ఆదేశించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు వరద ప్రభావం ఎక్కువగా వున్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు జగన్. 

  • అల్లూరి సీతారామరాజు జిల్లా - కార్తికేయ మిశ్రా
  • తూర్పుగోదావరి జిల్లా - అరుణ్ కుమార్
  • బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా - ప్రవీణ్ కుమార్
  • ఏలూరు జిల్లా - కాటమనేని భాస్కర్

ఇకపోతే... పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గోదావరి వరద నేపథ్యంలో శుక్రవారం ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ వద్ద ప్రమాదకర పరిస్ధితులు ఏర్పాడ్డాయన్నారు. ఇప్పటికే లోయర్ కాఫర్ డ్యామ్ మునిగిపోయిందని... 28 లక్షల క్యూసెక్కుల వరకే ఎగువ కాఫర్ డ్యామ్ తట్టుకోగలదని అంబటి తెలిపారు. రేపటికి 30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం వుందని ఆయన వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయించినట్లు అంబటి రాంబాబు తెలిపారు.