Asianet News TeluguAsianet News Telugu

టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా పాజిటివ్‌గా పరిగణిస్తూ వైద్యం: సీఎంకు తెలిపిన అధికారులు

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నివారణ చర్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

AP CM YS Jagan review meeting on coronavirus
Author
Amaravathi, First Published Jul 14, 2020, 8:00 PM IST

అమరావతి: రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నివారణ చర్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారుల సమావేశమైన సీఎం పలు అంశాలపై చర్చించారు. 

రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు, కేసుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలని సీఎం సూచించారు. వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని... పేషంట్స్ కి అందించే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలని ఆదేశించారు. 

కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలలో మంచి ప్రమాణాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత అధికారులదే అని సీఎం అన్నారు. అందుకు ఎలాంటి మార్పులు చేయాలన్నా చేయండి అని పేర్కొన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో కూడిన హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

అంతేకాకుండా ఫీడ్‌బ్యాక్‌ కోసం ప్రతి రోజూ ప్రతి సెంటర్, ఆస్పత్రికీ కాల్స్‌ చేయాలని... ప్రతి క్వారంటైన్‌ కేంద్రం, కోవిడ్‌ కేర్‌ సెంటర్, కోవిడ్‌ ఆస్పత్రులకు ఖచ్చితంగా ర్యాండమ్‌గా కనీసం 3 ఫోన్‌ కాల్స్‌ చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆస్పత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. 

read more  పంచాయితీరాజ్ శాఖలో కలకలం... ప్రధాన కార్యాలయానికి తాకిన కరోనా సెగ

సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమైనదని...కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, కోవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు జారీచేయాలని సీఎం ఉన్నతాధికారులకు సూచించారు. దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాడాల్సిన అవసరం ఉందని... పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలు సాధించలేమని అన్నారు. 

కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తి దృష్టి పెట్టాలని... జీఎంపీ ప్రమాణాలున్న మందులనే చికిత్స పొందుతున్న వారికి అందించాలన్నారు. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఉండాలని... అవి ఎక్కడ ఉన్నాయన్న దానిపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ఎవరికైనా కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్‌ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం తీసుకురావాలని... ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే హోర్డింగ్స్‌ను విస్తృతంగా పెట్టించాలన్నారు సీఎం. 

కరోనా టెస్టులు ఒక ఎస్‌ఓపీ ప్రకారం చేయాలని..ఎవరికి చేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలని నిర్దేశించారు. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలన్నారు. 

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని సీఎంకు వివరించారు అధికారులు, అలాగే హైరిస్క్‌ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా  పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామన్నారు అధికారులు. పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రికి వస్తుండడంతో మరణాలు సంభవిస్తున్నాయని... అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. 

కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించిన సీఎం. దీనికి సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో సేవలందిస్తున్నందున వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలన్నారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు సీఎంకు  తెలిపారు. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్‌ సిద్ధంచేశామని వెల్లడించారు. 

కనీసం 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పెగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.  కోవిడ్‌ విస్తృతి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారి సేవలు వినియోగించుకుంటామన్నారు. ఆ ప్రణాళికలను సీఎం కు తెలపగా అప్పటికప్పుడే అంగీకారం తెలిపారు. 

కోవిడ్‌ కేసు వస్తే ఏ ఆస్పత్రి కూడా వైద్యానికి నిరాకరించకూడదని... అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు. అలా కరోనాకు వైద్యాన్ని నిరాకరించే హాస్పిటల్ పర్మిషన్‌ రద్దు చేస్తామన్నారు. ఆమేరకు కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios