అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు సీఎం జగన్... వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వరద తగ్గింది కానీ, బురద తగ్గకపోవడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) కోనసీమ జిల్లా (ambedkar konaseema district) పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25న జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం. కోనసీమ జిల్లాలో వరద ఉద్ధృతి తగ్గినా , లంక గ్రామాల ప్రజలను కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరద తగ్గింది కానీ.. బురదతో ఇబ్బందిపడుతున్నారు లంక గ్రామాల ప్రజలు. లంక గ్రామాల్లో వరద నీరు తగ్గడంతో ఇళ్లకెళ్లి.. శుభ్రం చేసుకుంటున్నారు గ్రామస్తులు. భారీగా పంటనష్టం వాటిల్లింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
మరోవైపు.. వరద సాయంపై చంద్రబాబు (chandrababu naidu) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు నమ్మని పరిస్ధితి వుందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని సజ్జల తెలిపారు. చంద్రబాబు చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని.. పరామర్శ కంటే ప్రచారానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు పర్యటిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన వుంటే వర్షాలు సరిగా పడవని ఎద్దేవా చేశారు. తుఫాన్ల సమయంలో నయా పైసా సాయం అందించారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే పుష్కరాల్లో అపశృతి జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇకపోతే.. టీడీపీ (tdp) తెలివి తక్కువతనంతోనే లోయర్ కాపర్ డ్యామ్ మునిగిపోయిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) ఆరోపించారు. కాపర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారని అన్నారు. ఇది నిజమో కాదో టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పోలవరంపై టీడీపీ చెబుతున్న మాటలు అవాస్తవం అని అన్నారు. స్పిల్ వేను ఆపేసి డయాఫ్రమ్ ఎలా నిర్మించారని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఘోరమైన తప్పిదాలు చేశారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.