డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ వరం
ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది జగన్ సర్కార్. ఇకపై ప్రతీ ఏడాది విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
ప్రకాశం: నిరుద్యోగులకు మరోకీలక వరం ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది జగన్ సర్కార్. ఇకపై ప్రతీ ఏడాది విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లాలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేష్ విద్యారంగం అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనబడి–మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, బ్లాక్బోర్డ్స్, ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. నెలలో 1, 3వ శనివారాలను నో బ్యాగ్ డేగా పాటించి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.
రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా బడిలో చేరిన విద్యార్థులందరికీ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, డ్రాప్ అవుట్స్ తగ్గిస్తున్నట్లు మంత్రి సురేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖలో కూడా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్చువల్ క్లాసులు, డిజిటల్ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు చెప్పుకొచ్చారు. ఈ పనులు కేటాయింపునకు రివర్స్ టెండరింగ్కు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. పారదర్శకంగా పరిపాలన ఉంటుందన్నారు.
బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టత కోసం ప్రైవేటు విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణ కోసం సీఎం జగన్, జస్టిస్ కాంతా రావు, జస్టిస్ ఈశ్వరయ్యలతో కమిషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సంస్కరణలకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా విద్యాదినోత్సవం నాడు ప్రతిభా వంతులైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు.
ఇకపోతే సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు తరువాత వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు ఖచ్చితంగా వస్తాయని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలా 5 ఏళ్ల పాటు మాయమాటలు చెప్పి తప్పించుకునే పరిస్థితి తమకు రాదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.1500 కోట్లతో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల నష్ట పరిహారానికి, పునరావాస కాలనీలకు మొదటి విడతగా రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించినట్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే 3 జిల్లాల్లో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు వస్తుందని తెలిపారు.
మొదటి దశలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సుమారు 1.16 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని స్పష్టం చేశారు. 2వ టన్నెల్ పనులకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.