అమిత్ షాతో సీఎం జగన్ గంటన్నర భేటీ: చర్చించిన అంశాలివే...
ఇవాళ(బుధవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం జగన్ సుమారు 1 గంటా 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: డిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(బుధవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. సుమారు 1 గంటా 25 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. మూడు రాజధానులు, పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా,రెవిన్యూ లోటు, దిశా బిల్లు కు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు, బిల్లు ఆమోదం, రాయల సీమ ఎత్తుపోతల పథకం అనుమతులు తదితర అంశాలపై హోంమంత్రితో జగన్ చర్చించారు.
పోలవరంపై:
2017–18 ధరల సూచీని పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా ఆమోదించాలని, ఈ మేరకు రెండవ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కు (ఆర్సీఈ) ఆమోదం తెలపాలని కేంద్ర హోంమంత్రిని కోరారు జగన్. ఈ మేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై చర్చించి లేఖ అందించిన సీఎం పోలవరం ప్రాజెక్ట్ కింద సేకరించాల్సిన భూమి 1,02,130 ఎకరాల నుంచి 1,55,465 ఎకరాలకు పెరిగిందన్నారు. 2013 భూసేకరణ, పునరావాస చట్టం కింద క్షేత్రస్థాయి సర్వే తర్వాత భూ సేకరణలో 55,335 ఎకరాలు పెరిగిందని తెలిపారు. అలాగే ముంపు ప్రాంతాలనుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందన్నారు. డిసెంబర్ 2018 నుంచి చెల్లించాల్సిన రూ. 1,644.23 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని... వాటిని వెంటనే చెల్లించాలని కోరారు సీఎం.
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్:–
ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం. దీంట్లో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసిందని హోమంత్రికి వివరించారు. ఆగస్టులో దీనికి సంబంధించిన ఏపీ అన్ని ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం–2020 చేసిందని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని జగన్ గుర్తుచేశారు.
ట్రైబల్ యూనివర్శిటీ:–
విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించిందని... ఈ ప్రాంతం సబ్ప్లాన్ ఏరియాలో ఉందని తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు తగిన చర్యలను సంబంధిత శాఖ తీసుకునేలా చూడాలని జగన్ కోరారు.
ఏపీకి ప్రత్యేక హోదా:–
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్ షాను కోరారు జగన్. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది చాలా అవసరమని... ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కారణంగా కేంద్రం నుంచి గ్రాంట్లు లభిస్తాయన్నారు.. దీనివల్ల ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుందన్నారు. కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
రెవిన్యూ లోటు:–
2014–15 నాటికి రెవిన్యూ లోటు రూ. 22, 948.76 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది కాని రూ. 4,117.89 కోట్లు మాత్రమే కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఇందులోకూడా రూ. 3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసిందని... ఇందులో మిగిలిన బకాయిలతో పాటు రాష్ట్రం పేర్కొన్న విధంగా మిగిలిన రూ. 18830.87 కోట్లు విడుదల చేయాలని సీఎం కోరారు.
కోవిడ్ వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీలకు అనుమతులు:–
రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను లేఖలో వివరించిన సీఎం జనవరి 16 నుంచి 332 కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. వచ్చే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వాక్సినేషన్ పూర్తిచేసే దిశగా రాష్ట్రం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నామని... నాణ్యమైన వైద్యసేవల కోసం వైద్యులు, నర్సుల సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందన్నారు. దీనికోసం కొత్తగా 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని... వీటితో పాటు ఇదివరకే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఇప్పటికే మూడు కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని...మిగిలిన 13 కాలేజీలను, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను మంజూరు చేయాలని సీఎం జగన్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే సంబంధించి అనుమతులు కోరినట్లు...వీటికి వెంటనే ఆమోదం తెలపాలని అన్నారు. కాలేజీల ఏర్పాటుకు తగినంత ఆర్థిక సహాయం అందించాలని కూడా జగన్ విజ్ఞప్తి చేశారు.
ధాన్యం కొనుగోలు బకాయిలు:–
ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు చెల్లించాల్సిన రూ.4282 కోట్ల బకాయిలను కేంద్రం చెల్లించాల్సి ఉందని.. ఈ బకాయిలను వెంటనే విడుదలచేయాలని సీఎ: కోరారు. రైతులకు కనీస మద్దతు ధరలను చెల్లింపునకు ఇది దోహదపడుతుందన్నారు. సహకార సంస్థలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ధాన్య సేకరణ బకాయిలను చెల్లింపులో అ డబ్బు విడుదల చాలా సహాయపడుతుందన్నారు.
ఉపాధి హామీ పథకం:–
లాక్డౌన్ తదనంతర పరిణామాల్లో భాగంగా చాలామంది తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చారని... ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఉపాధిహామీ కింద ప్రస్తుతం ఉన్న పనిదినాలు 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కోరారు. అలాగే అంగన్వాడీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ కార్యక్రమాల కోసం పెండింగులో ఉన్న రూ.3,707.77 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు.
స్థానిక సంస్థలకు బకాయిలు:–
14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు స్థానిక సంస్థలకు విడుదలచేయాల్సిన రూ. 529.95 కోట్ల రూపాయలను విడుదల చేయాలని... అలాగే 15 వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు రెండో విడత కింద రూరల్ లోకల్ బాడీస్కు విడుదల చేయాల్సిన రూ.1,312.5 కోట్లను కూడా వెంటనే విడుదలచేయాలని జగన్ కోరారు. కోవిడ్ నివారణా చర్యలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టడానికి ఈ నిధులు ఎంతో అవసరం అవుతాయన్నారు.
నివర్ తుపాను బాధిత ప్రాంతాల్లో చర్యలకు సహాయం:–
జాతీయ విపత్తు నిధి కింద నివర్ సైక్లోన్ బాధిత ప్రాంతాల్లో చర్యలకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకూ భారీగా వర్షాలు కురిశాయని... నవంబర్ నెలలో నివర్ సైక్లోన్ వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిందన్నారు. ఎన్టీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం బాధిత ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీ మరియు తాత్కాలిక పునరుద్ధరణ పనులకోసం రూ.2,255.7 కోట్లను విడుదల చేయాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని... ఈ మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలని కోరారు.
విద్యుత్ రంగం:–
ఏపీ విద్యుత్ రంగం పునరుత్తేజానికి తగిన సహాయం అందించాలని సూచించారు. డిస్కంల ఆర్థిక పరిస్థితి బాగోలేదని... విద్యుత్ రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు, సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. కుడిగి, వల్లూరు థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో డిస్కంలు 2040 వరకూ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇతర విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే... ఈ ప్లాంట్ల రేట్లు చాలా అధికంగా ఉన్నాయన్నారు. డిస్కంల ఆర్థిక పరిస్థితులకు తోడు, కోవిడ్ పర్యవసానాలు కూడా తోడయ్యాయని... ఈ నేపథ్యంలో ఇంత రేట్లు చెల్లించే స్థితిలో ఏపీ డిస్కంలు లేవన్నారు. ఈ రెండు ప్లాంట్ల నుంచి విద్యుత్ను సరెండర్ చేయడానికి అంగీకరించాలని హోమంత్రిని కోరారు. దీనివల్ల ప్రతి ఏటా రూ. 325 కోట్ల ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లింపులు భారం డిస్కంలకు తప్పుతుందన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రూ. 5,541.78 కోట్లను విద్యుత్ కొనుగోలు రూపంలో ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సి ఉందని... ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షరతులతో కూడిన రుణాలను తెలంగాణ డిస్కంలకు ఇవ్వడం ద్వారా ఏపీ జెన్కోకు ఆ చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు. అప్పర్ సీలేరులో చేపడుతున్న 1350 మెగావాట్ల రివర్స్ పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు సుమారు రూ.8,000 కోట్లు ఖర్చు అవుతుందని, దీనికి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలన్నారు. అలాగే అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు.
దిశ బిల్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి అనుమతి:–
దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అలాగే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు:–
రాయలసీమలోని నాలుగు జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాలని, వర్షాలు, కృష్ణా నీల్లే వీటికి ఆధారమని... వర్షాలు తగ్గినప్పుడు, కృష్ణాలో నీళ్లు లేనప్పుడు తాగునీరు, సాగునీరుకు తీవ్ర కొరత ఏర్పడి ప్రజలు వలసల దారిపడుతున్నారని వివరించారు. దీనికోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. దీనివల్ల ఆయకట్టు పెరగడం కానీ, కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోవడం జరగదని తెలిపారు. వణ్యప్రాణి అభయారణ్యాలకు భంగంకాని, ఇతర పర్యావరణ ఇబ్బందులు కాని తలెత్తవన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న విషయాన్ని చెన్నై ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసిన విషయాన్నిహోంమంత్రికి నివేదించారు. ప్రాజెక్టును ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖను ఆదేశించాలని సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాను కోరారు.