వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల కంటి సమస్యలు దూరం చేసేందుకు వీలుగా ఉద్దేశించిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని జగన్ ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల కంటి సమస్యలు దూరం చేసేందుకు వీలుగా ఉద్దేశించిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని జగన్ ప్రారంభించారు.
అనంతపురం నగరంలోని జూనియర్ కాలేజీ గ్రాండ్స్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ కంటి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, వైద్య సేవలు, కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయనున్నారు.
ఈ పథకం మొత్తం మూడేళ్ల పాటు అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ఐదు దశల్లో అమలయ్యే ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. దీని కింద దాదాపు 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ నెల 16 వరకు జరిగే మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది స్కూల్ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తుంది.
అంతకుముందు గన్నవరం నుంచి అనంతపురం చేరుకున్న వైఎస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.