బ్రహ్మంసాగర్ ఎప్పటికీ నిండుకుండలా ఉండేలా చూస్తా: బద్వేల్లో జగన్
రెండు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ టూర్ ఇవాళ కూడ కొనసాగింది. గురువారం నాడు పులివెందులలో జగన్ పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇవాళ బద్వేల్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.
బద్వేల్: బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్దిలో పరుగులు పెట్టిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.శుక్రవారం నాడు బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు.వైఎస్ఆర్ బతికున్న కాలంలో ఈ నియోజకవర్గంలోని బ్రహ్మంసాగర్ లో 14 టీఎంసీల నీరు నిల్వ చేశారన్నారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు మాత్రం ఏనాడూ కూడ ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నింపలేదని ఆయన విమర్శించారు.మళ్లీ మన పాలనలో బ్రహ్మంసాగర్ నిండుకుండలా ఉందని జగన్ చెప్పారు.
బ్రహ్మంసాగర్ ఎప్పటికీ నిండుకుండా ఉండేలా చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో బద్వేలు ఒకటని ఆయన గుర్తు చేశారు. ఈ నియోజకవర్గానికి మంచి జరిగిన పరిస్థితులు ఎప్పుడూ కన్పించలేదని ఆయన చెప్పారు.
కుందూనది మీద లిఫ్ట్ పెట్టి బ్రహ్మంసాగర్ కు నీళ్లు తరలించేందుకు రూ. 600 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. ఈ పనులు కూడ రెండేళ్లలో పూర్తవుతాయన్నారు. అభివృద్ది పనులతో బద్వేల్ రూపురేఖలు మారిపోతాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల వినతి మేరకు ఆర్డీఓ కార్యాలయంతో పాటు, రోడ్లు,ఇతర అవసరాలకు నిధులను మంజూరు చేస్తున్నామని జగన్ ప్రకటించారు.